Welcome to my blog!

సాధారణంగా మథనం అనే మాటని ఒక నిరాశాజనిత పదంగా అభివర్ణిస్తారు. కాని ఈ వర్ణన సరియైనది కాదేమో అని నా అభిప్రాయము. ఒకసారి చరిత్ర చూస్తే క్షీర సాగర మథనం వల్ల లోక కంటకుడైన అసురుడు వధించబడ్డాడు. మేఘ మథనం వల్ల పుడమి తల్లి పచ్చని రంగు పూసుకుని జీవకోటికి శక్తినిస్తోంది. కాబట్టి మథనం వలన మేలు జరుగుతుందని విశ్వసిస్తూ, ఈ మనో మథనం లో సమాజం గురించి, జరుగుతున్న మంచి/చెడు సంఘటనల గురించి నా అభిప్రాయాలు తెలియజేయదల్చుకున్నాను. ఇవి కేవలం నా సొంత అభిప్రాయాలు మాత్రమే.

సలహాలు సదా స్వీకరించబడును. అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పుట అభినందనీయము.



Please visit http://www.mangalagiricottons.com/

This is one of the very good attempts made to raise the fallen weaving profession in Mangalagiri, Guntur Dt., AndhraPradesh, India.

Feb 6, 2010

మూఢనమ్మకాలు

నా మొదటి బ్లాగ్ ని నేటి సమాజం లో వున్నఅర్థం లేని నమ్మకాల మీద నా అభిప్రాయం తో మొదలుపెట్టదలచుకున్నాను.

నేను విన్న ఒక చిన్న కథ చెప్తాను. "ఒక ఊరిలో ఒక గురువు గారు తన ఇంటి ఆవరణలో ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ వుండేవారు. రోజూ సాయంకాలానికి ప్రజలందరూ ఆయన ఇంటికి చేరేవారు. ఆయన ఇంట్లో వున్న ఒక పిల్లి సమావేశం జరుగుతున్నపుడు అటూ ఇటూ గెంతుతూ అందరికీ ఇబ్బంది కలిగించేది. దీనితో విసిగిపోయిన గురువు గారు రోజూ సమావేశం మొదలవడానికి ముందు పిల్లిని తన పక్కగా వున్న స్తంభానికి కట్టేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక గురువు గారు కాలం చేశారు. తరువాత గురువు గారి భాద్యత ని ఆయన కుమారుడు స్వీకరించాడు. ఆ రోజు సాయంత్రానికి ప్రజలందరూ ఆయన ఇంటికి చేరారు. గురువుగారి కుమారుడు కుడా వచ్చి కూర్చున్నాడు. కాని ఎంత సేపటికి సమావేశం మొదలుపెట్టట్లేదు. కాసేపు వేచి చూసాక అక్కడ కూర్చున్న ఒక పెద్దాయన లేచి కారణం అడిగాడు. గురువు గారి కుమారుడు చెప్పాడు, మా నాన్న గారు బ్రతికి వున్న రోజులలో సభ మొదలు పెట్టడానికి ముందు ఒక పిల్లి ని తెచ్చి ఇక్కడ కట్టేవారు, ఇపుడా పిల్లి పారిపాయింది. శిష్యులు వెతికి తేవడానికి వెళ్ళారు, పిల్లి దొరకగానే సమావేశం ప్రారంభిద్దాం అన్నాడు".

వినడానికి హాస్యాస్పదంగా అనిపించినా నేడు ప్రజలలో వున్న నమ్మకాలు ఇలాగే వున్నాయి. మా అమ్మ ఇప్పటికీ చెప్తూ వుంటుంది, "రాత్రి వేళల్లో ఉప్పు అనకూడదు" అని. చిన్నపుడు ఎందుకు అలా అనకూడదో అర్థం అయ్యేది కాదు. కాని తరువాత నాకు తెలిసిందేమిటంటే పూర్వం ఇప్పుడున్నట్లుగా కరెంటు బల్బులు ఉండేవి కావు. రాత్రి వేళల్లో దీపాలు వెలిగించేవారు. ఉప్పు అంటే నోటినుంచి గాలి ఎక్కువగా వెలువడుతుంది, దానివల్ల దీపాలు ఆరిపోతాయని రాత్రి వేళల్లో ఉప్పు అనేవారు కాదు. కాని ఇపుడు పరిస్థితి మారిపోయింది. ఇపుడు ఉప్పు అనడం వలన ఏమి కాదు కదా! ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కలవకూడదు అంటారు. ఎందుకో అర్థం కాలేదు. నాకు తెలిసిన ఒక పెద్దాయన చెప్పారు, "సాధారణంగా ఆషాఢమాసం సెప్టెంబర్/అక్టోబర్ లో వస్తుంది. ఆ సమయం లో కొత్తగా పెళ్ళైన దంపతులు కలిస్తే ఆ స్త్రీ గర్భం ధరించి నవమాసాలు గడిచే సరికి మే/జూన్ నెల వస్తుంది. అప్పుడు ఎండలు బాగా వుంటాయి, అసలే సౌకర్యాలు అరకొరగా వుండే పాతకాలంలో ఇబ్బందులు వస్తాయని ఆషాఢమాసం లో దంపతులను వేరుగా వుంచుతారు" అని. కాని ఇపుడు పరిస్థితి అలా లేదు కదా! చక్కటి వైద్యసదుపాయాలు అందుబాటులో వున్నాయి. ఒక ఫోన్ కాల్ దూరంలో 108 సర్వీసులు వున్నాయి. పరిస్థితి చాలా మెరుగుపడింది. కానీ ఇప్పటికి కుడా అదే ఆచారం పాటిస్తున్నారు. ఇవే కావు, "ఒంటి బ్రాహ్మణుడు ఎదురుపడకూడదు", "భర్త పోయిన స్త్రీ ఎదురుపడకూడదు", "ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదు", "బయల్దేరేటపుడు తుమ్మకూడదు" ఇలాంటివి ఎన్నో వున్నాయి. మన పెద్దలు చెప్పినవి తప్పు అనట్లేదు నేను. మన పెద్దవారు చాలా విజ్ఞత కలిగినవారు. వారు చెప్పిన ప్రతిదానికీ ఏదో ఒక కారణం ఖచ్చితంగా వుంటుంది. కానీ వారు చెప్పిన వాటిలో చాలా వరకు అప్పటి కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా వున్నాయి. ఇప్పటి కాలానికి, పరిస్థితులకు తగ్గట్లుగా వాటిని విశ్లేషించి సవరించాల్సిన అవసరం, భాద్యత ఎంతైనా వుంది. అది వారిని ఎంతమాత్రము అగౌరవపరచినట్లు కాదు. వారి బాటలో నడవడం అంటే వారు చెప్పింది గుడ్డిగా నమ్మి పాటించడం కాదు. వారి ఆదర్శాలను పునాదిగా చేసుకుంటూ కొత్త భవంతులు నిర్మిద్దాం మరియు మన భవిష్యత్తువారికి బాటలు వేద్దాం.

3 comments:

  1. Good one indeed....
    chakkaga chepparu Anil....
    ardhamleni nammakaaluto...edutuvaarini baadha pettatam entavaraku samasajam ani manam okkasaari alochinchalsinde...!!!

    ReplyDelete
  2. Good one ra Anil.......You laied the first step to stop this. Hats off.....

    ReplyDelete