Welcome to my blog!

సాధారణంగా మథనం అనే మాటని ఒక నిరాశాజనిత పదంగా అభివర్ణిస్తారు. కాని ఈ వర్ణన సరియైనది కాదేమో అని నా అభిప్రాయము. ఒకసారి చరిత్ర చూస్తే క్షీర సాగర మథనం వల్ల లోక కంటకుడైన అసురుడు వధించబడ్డాడు. మేఘ మథనం వల్ల పుడమి తల్లి పచ్చని రంగు పూసుకుని జీవకోటికి శక్తినిస్తోంది. కాబట్టి మథనం వలన మేలు జరుగుతుందని విశ్వసిస్తూ, ఈ మనో మథనం లో సమాజం గురించి, జరుగుతున్న మంచి/చెడు సంఘటనల గురించి నా అభిప్రాయాలు తెలియజేయదల్చుకున్నాను. ఇవి కేవలం నా సొంత అభిప్రాయాలు మాత్రమే.

సలహాలు సదా స్వీకరించబడును. అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పుట అభినందనీయము.



Please visit http://www.mangalagiricottons.com/

This is one of the very good attempts made to raise the fallen weaving profession in Mangalagiri, Guntur Dt., AndhraPradesh, India.

Feb 24, 2010

వార్తా మాధ్యమాలు

ఈ పోస్టులో పత్రికా స్వాతంత్ర్యం గురించి, నేడు చలామణిలో వున్న పత్రికలు మరియు వార్తా ఛానళ్ళ తీరు గురించి నా అభిప్రాయం చెప్పదలచుకున్నాను.

"అరే యార్, ఇధర్ ఆవ్,
దేఖో, ఆంధ్రుల దినపత్రిక!
పెట్టుబడికి,   కట్టుకథ   కి
పుట్టిన    విష పుత్రిక!!"

ఇవి నేనన్న మాటలు కావు. మహాకవి శ్రీ శ్రీ గారు 1970వ దశకంలో అన్న మాటలు. సందర్భానికి తగినదని ఇక్కడ ప్రస్తావించడమైనది. ఆయన మీద గౌరవమో, లేక ఎవరెన్ని చెప్పినా మేము ఇలాగే వుంటాము అని పరోక్షంగా చెప్పడమో నేటి పత్రికల(ఒకటో రెండో దీనికి మినహాయింపు అనుకుంటాను) చందము ఇప్పటికీ అలాగే వుంది. వార్తాఛానళ్ళ పరిస్థితి సరే సరి. గత 5 సంవత్సరాలలో పుట్టుకొచ్చిన కొత్త కొత్త వార్తా ఛానళ్ళ ఉధృతిలో సంపాదకవిలువలు కొట్టుకుపోయాయనడం అతిశయోక్తి కాదేమో. TRP రేటింగుల రేసులో కనీసవిలువలు గాలికొదిలేశారు. నిష్పక్షపాతంగా, ఎటువంటి భావావేశాలకు తావివ్వకుండా సమాజంలో జరుగుతున్న మంచి చెడు సంఘటనలను ప్రజలకు అందించవలసిన ఈ మాధ్యమాలు తమ కీర్తిప్రతిష్ఠలను పెంచుకోవాలన్న స్వార్థంతో రాజకీయ పార్టీ కరపత్రాలుగా మారిన వైనం అందరికి తెలిసిందే. నేడు చలామణిలో ఒక పత్రికను ఉదాహరణగా తీసుకుంటే, తమ రేటింగు పెంచుకోవడం కోసం తమ పత్రికలో అన్నీ కలర్ పేజీలే అని చెప్తుంది, లేని సర్క్యులేషన్ ను వున్నట్టుగా చూపిస్తుంది. అంతవరకు పర్లేదు. అది ఆ సదరు పత్రికా యజమాని ఇష్టం, ఎందుకంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా అతనే భరిస్తాడు కాబట్టి. కాని ఆ పత్రిక విషయానికి వస్తే, అది కేవలం కొంత మంది రాజకీయ వ్యక్తుల ప్రయోజనాలకోసం ఆవిర్భవించిన పత్రిక అన్నది బహిరంగసత్యం. ఈ తెర చాటు రాజకీయ నాయకులు తమ భాగోతాలను బయటపెడుతున్న మరొక పత్రిక మీద బురదచల్లటానికి, తమ పత్రికను కేవలం ఒక ఆయుధంగా వాడుకుంటూ చేస్తున్న బహిర్గతదాడిలో "ఏది నిజమో" అందరికీ తెలుసు. వీలైతే కీలక వ్యక్తులను బ్రతిమలాడో బెదిరించో తమ వైపుకు తిప్పుకోవడానికి కూడా వెనుకాడడంలేదు. వీరికి తమవారు చేస్తున్న నేరాలు, తప్పుల గురించి అణుమాత్రమైనా సమాచారం అందదు. రంగుపేజీల ముసుగులో, "సమాజానికి నిలువుటద్దం మా పత్రిక" అనే వాణిజ్యప్రకటనల హోరులో సామాన్య ప్రజలను మోసగించడం ఎలా సమర్ధించగలరు. ఇక విలువల గురించి మట్లాడడానికి నాకే సిగ్గుగా వుంది.

ఏదో ఒక సినిమాలో చెప్పినట్టుగా, అశ్లీల సాహిత్యం మన వార్తాఛానెళ్ళు చూపించినంత జనరంజకమైనపధ్ధతిలో ఇంకెవరూ చూపించలేరేమో! ఉదాహరణకు, కొద్దికాలం కిందట జరిగిన ఒక బాబాగారి పడకగది వ్యవహారం అంతా వార్తాఛానెళ్ళలో వీడియోప్రదర్శన నిర్వహించారు. కొన్ని అతిముఖ్యమైన సన్నివేశాలను మసకబార్చారనుకోండి. కాని మామూలు వాటి కన్నా, మసకచిత్రాల వెనుకనున్న నిజాన్ని చుడాలన్న ఉత్సుకత చాలా వుంటుంది. ఇందులో ఎటువంటి స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ లేదు, పైపెచ్చు వార్తలను సరియైన పధ్ధతిలో అందించలేకపోవడంవల్ల యువత పక్కదారి పట్టడానికి దారులు తెరుస్తున్నట్లవుతున్నది. ఇటువంటి ఆవేశాలను రెచ్చగొట్టడం ఎంతమాత్రం అభినందనీయం కాదు కదా. భాద్యత గల పత్రికలు, వార్తా ఛానెళ్ళు ఇలాంటి పనులు చేయడం సహించరానిది.

రాత్రి అందరూ నిద్రపోయాక(నిద్రపోయారు అనుకున్నాక) వచ్చే రియల్ స్టొరీస్ ని తెరకెక్కించే విధానం కుడా అలాగే వుంటుంది. ఖైదీలకు ఉరిశిక్ష అమలుచేసే తలారి నల్లటి దేహసౌందర్యంతో, మాసిన గడ్డంతో, బుర్ర మీసాలతో యముడికి ప్రతిరూపంగా వున్నట్లు, ఈ రియల్ స్టోరీస్ యాంకర్స్ కుడా అలాగే వుంటారు. విచిత్ర వేషధారణతో విచిత్ర హావభావాలతో నిజజీవితగాధలను వీరు తెరకెక్కించే తీరు ఒళ్ళుగగుర్పొడిచేలా వుంటుంది. వీటివల్ల ఎవరికి ఏమి ఒరుగుతుందో అర్థం కాదు.

నేను ఏ పత్రికను, ఏ ఛానెల్ ను సమర్థించట్లేదు. ఆయా సంస్థల వేళ్ళూనుకుపోయిన లోపాలను, స్వార్థపూరిత లక్ష్యాలను ఎత్తి చూపాలనుకుంటున్నాను.

కొంత ఆత్మావలోకనం చేసుకుంటే, మనం కూడా మారామనిపిస్తోంది. ఏ విషయమైనా మసాలా లేకుండా చెప్తే చాలా తక్కువమందికి అర్థం అవుతోంది. అదే విషయానికి కొన్ని వున్నవి లేనివి జోడించి మన బుధ్ధికి అంగీకారమైన పధ్ధతిలో చెప్తే బాగా అర్థం అవుతోంది. ఈ విషయాన్ని మనకన్నా ముందుగా ఆకళింపు చేసుకుని "మనః"కంగీకారమైన పధ్ధతిలో సమాచారాన్ని చేరవేయడంలో ఆరితేరిన పత్రికాసంపాదకులదే తప్పంతా అనడం ఎంతవరకు సమంజసం?

ఏది ఏమైనా నష్టం సమజానికే, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మనకే. పారాహుషార్!

No comments:

Post a Comment