Welcome to my blog!

సాధారణంగా మథనం అనే మాటని ఒక నిరాశాజనిత పదంగా అభివర్ణిస్తారు. కాని ఈ వర్ణన సరియైనది కాదేమో అని నా అభిప్రాయము. ఒకసారి చరిత్ర చూస్తే క్షీర సాగర మథనం వల్ల లోక కంటకుడైన అసురుడు వధించబడ్డాడు. మేఘ మథనం వల్ల పుడమి తల్లి పచ్చని రంగు పూసుకుని జీవకోటికి శక్తినిస్తోంది. కాబట్టి మథనం వలన మేలు జరుగుతుందని విశ్వసిస్తూ, ఈ మనో మథనం లో సమాజం గురించి, జరుగుతున్న మంచి/చెడు సంఘటనల గురించి నా అభిప్రాయాలు తెలియజేయదల్చుకున్నాను. ఇవి కేవలం నా సొంత అభిప్రాయాలు మాత్రమే.

సలహాలు సదా స్వీకరించబడును. అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పుట అభినందనీయము.



Please visit http://www.mangalagiricottons.com/

This is one of the very good attempts made to raise the fallen weaving profession in Mangalagiri, Guntur Dt., AndhraPradesh, India.

Sep 4, 2010

పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణసంకటం

ఈ బ్లాగు ప్రస్తుతం రాష్ట్రంలో వేడి వేడిగా నడుస్తున్న పరిస్థితులమీద, (నీచమైన)తెలివితో పావులను కదుపుతున్న పెద్దమనుషుల మీద, భవిష్యత్తు మార్చగల విద్యాలోకం గొర్రెలుగా మారుతున్న వైనం పట్ల జాలితో, రాస్తున్నది. పిల్లి చెలగాటం కనీసం ఎలుకకు అర్థమవుతుంది. కనీసం ఆ మాత్రం కూడా అర్థం కాని మన విద్యార్థుల(?) మీద జాలి పడటం తప్పు కాదేమో.

తెలంగాణ అంశం రోజు రోజుకీ శ్రుతిమించుతోంది. నిజానికి ఈ విషయంలో రాజకీయనాయకులకు కూడా స్పష్టత వున్నట్టు కనిపించడం లేదు. పార్టీలు రోజుకో మాట మాట్లాడుతున్నాయి, ఎవరినీ నొప్పించక తానొవ్వకుండా వుందామని. మొన్న జరిగిన ఉప ఎన్నికల(ఎక్కువ స్థానాల్లో జరగకపోయినా) ఫలితాల వల్ల కొంత స్పష్టత వచ్చింది. తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం కావాలన్న భావన జనాల్లోకి వచ్చిందని తెలుస్తోంది. కాని తెలంగాణా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి రాజకీయనాయకులు ఎంతగా దిగజారారో చెప్పుకుంటే సిగ్గుచేటు. ఒక చిన్న సందేహం, పాతిక జిల్లాలుగా వుండి, 42 మంది MPలు వున్నపుడే, మంచి ప్రాజెక్టులన్నీ ఉత్తరాది రాష్ట్రాలు, తమిళనాడు తీసుకెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక మిన్నకుండిపోయాం. మళ్ళీ ఇపుడు విభజన జరిగితే, ఏ ప్రాంతం వారికైనా దొరికేవి ఎంగిలి మెతుకులు మాత్రమే. అభివృధ్ధి, పురోగతి మాట సరే సరి.

ఇవన్నీ పక్కన పెడితే, ఈ రోజు మన చదువుల తండ్రి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారి పుట్టినరోజు, ఉపాధ్యాయుల దినోత్సవం. ఈ సందర్భంగా చదువుల గురించి, విద్యార్థుల గురించి మాట్లాడదాం. కొన్ని రోజుల ముందు ఉస్మానియా యూనివర్సిటీ లో ఉపాధ్యాయలోకానికి తగిలిన గాయం అత్యంత దురదృష్టకర ఘటనల్లో ఒకటి. పేపరు వాల్యుయేషన్లో సీమాంధ్ర అధ్యాపకులు ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణా విద్యార్థులకు మార్కులు తగ్గిస్తున్నారు అని తెలంగాణా విద్యార్థులు(?) ఉపాధ్యాయుల మీద దాడి చేశారు. ఏ ఉపాధ్యాయుడైనా విద్యార్థి మంచి కోరుకుంటాడు తప్ప, కనీసం సొంత లాభం కూడా లేని ఇలాంటి పని చేస్తాడనుకోను. తెరాస నేత K. చంద్ర శేఖర్ గారు సీమాంధ్ర ఉపాధ్యాయుడు దిద్దిన పేపర్ లో ఒక అమ్మాయికి తక్కువ మార్కులొచ్చాయని, తరువాత రీవాల్యుయేషన్ తో ఆ అమ్మాయికి ఫస్టుక్లాసు మార్కులొచ్చాయని చెప్పారు. ఆ పేపరు ముందు ఎవరు దిద్దారో, తరువాత ఎవరు దిద్దారో మన నేత(?)గారికి ఎలా తెలిసిందో మరి, రీవాల్యుయేషన్ దరఖాస్తులో ఏ ప్రాంతం వారిచేత పేపరు దిద్దించాలి అని వుంటుందేమో, నాకు తెలియదులేండి. దొరికిన ప్రతీ అవకాశాన్నీ రాజకీయంగా వాడుకోవాలనుకునే ఇలాంటి చవకబారు నేతల చేతిలో రేపటి భవిష్యత్తు అని చెప్పుకునే నేటి యువత, విద్యార్థి పావులుగా మారుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, రేపు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా మారిన తరువాత కూడా, వేరే ప్రాంతపు ఉపాధ్యాయులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, వేరే ప్రాంతపు విద్యార్థులకు మార్కులు ఎక్కువ వస్తున్నాయనీ, వేరే ప్రాంతం వారి వల్ల తెలంగాణాలో నిరుద్యోగం ఎక్కువవుతోందని ప్రతీ దానికి గొడవలు చేయరని గ్యారంటీ ఏంటి. తెలంగాణాలో కేవలం తెలంగాణా వారే వుండాలనుకోవడం బుద్దితక్కువ, అదే జరిగితే తెలంగాణా రాష్ట్ర మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అది మన నేత(?)లకు తెలుసు. కాని తలచుకుంటే ఏదైనా చేయగల యువతను, విద్యార్థులను రెచ్చగొట్టడానికి విద్య, ఉద్యోగాలను ఎరగా వేస్తూ ఆడిస్తున్న నాటకం ఇది, కాదంటారా! ప్రత్యేక రాష్ట్రం వస్తే కొత్త ఉద్యోగాలు పుడతాయి కాని దాని వల్ల తెలంగాణా వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టడం చాలా తప్పు.

ఈ రోజు జరుగుతున్న APPSC పరీక్ష విషయంలో చేస్తున్న రభస కూడా చిత్రంగా వుంది. తెలంగాణా వచ్చేవరకు ఈ పరీక్షని నిరవధిక వాయిదా వేయాలని కోరడం హాస్యాస్పదం. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఇపుడు పరీక్ష జరిగితే తెలంగాణా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మళ్ళీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే, అందితే జుట్టు అందకపొతే కాళ్ళు అన్న చందాన, విద్యార్థులు పరీక్ష రాయడానికి సిధ్ధంగా లేరు, పరీక్ష రాసే వాతావరణం తెలంగాణాలో లేదని చెప్తున్నారు. విద్యార్థులని రాజకీయ కీచులాట లోకి లాగిందెవరు? వేరే పనులెన్ని వున్నా విద్యార్థి మొదటి కర్తవ్యం చదువు, విజ్ఞానం. కర్తవ్యాన్ని పక్కన పెట్టి రాజకీయ ఊడిగం చేయమని చెప్తున్న మన నేత(?)లను ఏమనాలి? APPSC పరీక్ష ఇవాళ జరిగితే, తరువాత జరిగే ప్రత్యామ్నాయాలకు ప్రభుత్వమే భాద్యత వహించాల్సి వస్తుందని ఒక రాజకీయ నాయకుడు ఆవేశంతో ఊగిపొతూ చెప్తున్నాడు. ఏమిటి మనకీ దౌర్భాగ్యం? ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు జరగలేదు. దీని ఫలితం ఈ రోజు తెలియకపోయినా, ఒక సంవత్సరం వృధా ఐతే ఎంత నష్టపోతామో విద్యార్థులకు ముందు ముందు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏది ఎలా జరిగినా ఈ రోజు జరగాల్సిన పరీక్ష జరిగి తీరుతుందని ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయం.

విద్యార్థులు మరియు యువత దేశభవిష్యత్తుని నిర్దేశించేవారు. రాజకీయాల పట్ల వారికి అవగాహన కలిగించడం, రాజకీయాలలోకి వారిని ప్రోత్సహించడం చాలా మంచి విషయం. రాజకీయ మేధావుల, రాజకీయ విశ్లేషకుల సత్సాంగత్యం వారికి మరియు దేశానికి ఎంతో మేలు చేస్తుంది. కాని ఇలా నీతి, విలువలు లేని నాయకులు చెప్పే చెప్పుడు మాటలకు, చూపించే తప్పుడు ఆశలకు లొంగిపోతే చివరకు మూల్యం చెల్లించుకునేది విద్యార్థులే. అపుడు మీ వెన్నుదన్నుగా వుంటామన్న నాయకులు కనుచూపుమేరలో కుడా వుండరు. జాగ్రత్త!

2 comments:

  1. ni mano madhananni broadcast chestunna...
    chuddam ee kaliyugam lo em dorukutundo...

    ReplyDelete
  2. chala baaga raasavu anil. Your words are crisp and precise. Keep writing. E wrong politicians valla idi varaku eppudu seperatist feelings leni vallaki kuda seperatist feelings vachayi...auto lo kurchoni driver to koddiga free ga untey, vallu 'sir, meru andhra na telangana na' ane sthiti ki teesukoni vacharu mana netalu..manushula madhya visham postunnaru, but on the other hand srikrishna report should be based on facts..if the facts say, telengana region has to be seperated and if it is the only solution for proper development, then that shud be accepted by all.

    ReplyDelete